'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Showing posts with label సాహిత్యం. Show all posts
Showing posts with label సాహిత్యం. Show all posts

Apr 8, 2012

నాకు నచ్చిన గురజాడ గారి రచన


పుత్తడి బొమ్మా పూర్ణమ్మ 

మేలిమి బంగరు మెలతల్లారా !
కలువల కన్నుల కన్నెల్లారా !
తల్లులగన్నా పిల్లల్లారా !
విన్నారమ్మా యీ కథను ?
ఆటల పాటల పేటికలారా !
కమ్మని మాటల కొమ్మల్లారా !
అమ్మలగన్నా అమ్మల్లారా !
విన్నారమ్మా మీరీ కథను ?
కొండల నడుమను కోనొకటున్నది !
కోనకి నడుమా కొలనొకటుంది !
కొలని గట్టునా కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.
పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా,
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజలు పువ్వులు కోసేది.
ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుములున్
అంగము లందున అమరెను పూర్ణకు
సౌరులు మించెను నానాటన్.
కాసుకు లోనై తల్లీ తండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక
ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ.
ఆమని రాగా దుర్గ కొలనులో
కలకల నవ్వెను తామరలు
ఆమని రాగా దుర్గ వనములో;
కిలకిల పలికెను కీరములు.
ముద్దు నవ్వులూ మురిపెములూ మరి
పెనిమిటి గాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మున
కన్నుల గ్రమ్మెను కన్నీరు.
ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాత యని కేలించ,
ఆటల పాటల కలియక పూర్ణిమ
దుర్గను చేరీ దుక్కించె
కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను;
చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు.
పసుపు రాసిరి బంగరు మేనికి
జలకము లాడెను పూర్ణమ్మ;
వదినెలు పూర్ణకు పరిపరి విధముల
నేర్పులు మెరసీ కై చేస్రీ.
పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ
తల్లీ తండ్రీ దీవించ్రీ;
దీవన వింటూ పక్కున నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ !
చిన్నల నందర కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరూ !
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.
"అన్నల్లారా తమ్ముల్లారా !
అమ్మను అయ్యను కానండీ
బంగరు దుర్గను భక్తితొ కొలవం
డమ్మల కమ్మా దుర్గమ్మ.
"ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ,
భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం
డమ్మల కమ్మా దుర్గమ్మ
నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొక తరి తలవండి;
మీమీ కన్న బిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి."
బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు
కన్నులు తుడుచుకు కలకల నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టన్
కాసుకు లోనై అల్లుని చూసుకు
ఆనందించెను అయ్యొకడె.
యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
యేరిన పువ్వులు సరిగూర్చి
సంతోషమ్మున దుర్గను కొలవను
వొంటిగ పోయెను పూర్ణమ్మ.
ఆవులు పెయ్యలు మందలు జేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు వొడమెను
యింటికి పూర్ణమ రాదాయె.
చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్ణమ యింటికి రాదాయె.
కన్నుల కాంతులు కలవల చేరెను
మేలిమి జేరెను మేని పసల్ !
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ.

- లాస్య రామకృష్ణ 

Mar 3, 2012

ప్రేమా నీ స్వభావమేంటి....


- లాస్య రామకృష్ణ 


ఎవ్వరినీ నొప్పించదు
ఎవ్వరినీ విసిగించదు

నీ సుఖమే నే కొరుకున్నా
నిను వీడి అందుకె వెళుతున్నా

అంటుందే కానీ యాసిడ్ దాడులు చేయదు
ఆయుధాలను చూపించి బెదరగొట్టదు 

నేనున్నాను అంటుంది ప్రేమ 
మానవత్వం గొప్పదంటుంది ప్రేమ

పసిపిల్లల నవ్వులలో 
చందమామలా చల్లని జాబిలి కురిపిస్తుంది

టేనేజీ అమ్మాయి నవ్వులలో 
నెలవంకలా కవ్విస్తుంది 

నీ మనసు ప్రేమమయం అయితే
జగమంతా ప్రేమమయం....

   

Feb 10, 2012

మనసు మూగదే కానీ భాషుంది దానికి


"మనసు మూగదే కానీ భాషుంది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుంది అది". 

"మనసుగతి ఇంతే 
మనిషి బ్రతుకింతే 
మనసున్న మనిషికి సుఖము లేదంతే"

"ఎక్కడ ఉన్న ఏమైనా, ఎవరికీ వారే వేరైనా 
నీ సుఖమే నే కోరుకున్న, నిను వీడి అందుకే వెళుతున్నా"

"చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు 
నీవు లేక దిక్కు లేని చుక్కలైనాము"


*   *   *   *   *   *


"నేనొక ప్రేమ పిపాసిని, నీ వొక ఆశ్రమవాసివి అనే భగ్న ప్రేమికుడి బాధనైన, తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము" అనే కొంటె ప్రేమికుడి చిలిపితనాన్నైన, 'అది ఒక ఇదిలే' లాంటి మత్తెక్కించే పాటలనైన రాయడానికి అత్రేయకి సాటిరారెవరు.

మనసు, ప్రేమ, జీవితం, విరహం లాంటి అంశాలను చాలా చిన్న పదాలతో ఎంతో బాగా వ్యక్తం చేసారు ఆత్రేయ. ఎక్కువ పాటలు మనసు మీదే రచించారు. అందుకే ఆయనకి మనసు కవి అని బిరుదు. 

ఆత్రేయ గురించి.... 

ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. అయన 7th May, 1921 లో నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన గోత్రం పేరునే కలం పేరుగా పెట్టుకున్నారు.

సినీ జీవితం...

"దీక్ష" అనే చిత్రం ద్వారా ఆత్రేయ సినీ జీవితం ప్రారంభమైంది. ఈ చిత్రం 1950 లో విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన రచించిన 'పోరా బాబు పో' పాటని పెండ్యాల నారాయణరావుగారు స్వరపరచగా, M.S. రామారావుగారు పాడారు.

'సంసారం' అనే చిత్రానికి ఆత్రేయ మొట్టమొదటి సారి స్క్రిప్ట్ వ్రాసారు. కేవలం పాటలకే పరిమితమవకుండా, మాటలు, దర్సకత్వం, నిర్మాణం లో కి కూడా ఆయన తనదైన ప్రతిభ చూపెట్టారు. 

1961 లో విడుదలైన "వాగ్దానం" చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. 

డాక్టరేట్....

తెలుగు సాహిత్యంలో ఆత్రేయ సేవని గుర్తించి డా.B.R.Ambedkar Open University వారు అత్రేయకి డాక్టరేట్ ని అందించారు.

విమర్శలు.....

ఆత్రేయ సమయానికి పాటలు ఇచ్చేవారు కాదని ప్రసిద్ది. అందుకే విమర్శకులు 'పాటలు రాయక నిర్మాతలని, రాసి ప్రేక్షకులని ఏడిపిస్తారు' అని అనేవారు. వాటికీ స్పందించిన ఆత్రేయ 'రాసేటప్పుడు నేనెంత ఏడుస్తానో ఎవరికీ తెలుసు' అని అనేవారు. 

"చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు నీవు లేక దిక్కు లేని చుక్కలైనాము"

13 Sep 1989 లో ఆత్రేయ మద్రాసులో కన్ను మూసారు. కానీ అతని పాటలు మాత్రం మనందరి హృదయాలలో  కలకాలం నిలిచి  ఉంటాయి.

- లాస్య రామకృష్ణ 


Jan 13, 2012

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావు


మనసు కవి ఆత్రేయ రచించిన పాటలు ఎన్నో ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచిపోయాయి. అయన మన మధ్య లేకపోయినా అతని పాటలు మన హృదయాలలో ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. అయన రచించిన ఎన్నో పాటలు, మాటలు జీవిత సత్యాలను తెలుపుతాయి. చిన్న చిన్నమాటలతో అల్లిన పదాలతో ఎన్నో భావాల్ని రంగరించి ప్రేక్షకులందరికీ దగ్గరయ్యారు ఆత్రేయ. అయన రచించిన ఒక పాట మీ కోసం. 


ఆత్రేయ
కనులు కనులతో  కలబడితే ...ఆ  తగవుకు  ఫలమేమి ..  
కలలే......... 
నా  కలలో  నీవే  కనబడితే .ఆ చొరవకు  బలమేమి ..
మరులే.......
మరులు  మనసులో  స్థిరపడితే..ఆ  పై  జరిగేదేమి..
మనువూ ...
మనువై  ఇద్దరు ఒకటైతే  ఆ  మనుగడ  పేరేమి .
సంసారం..

అల్లరి  ఏదో  చేసితివి ..చల్లగా  ఎదనే   దోచితివి ..  
అల్లరి  ఏదో  చేసితివి  ..చల్లగా   ఎదనే   దోచితివి .
ఏమీ  లేని  పేదనని..నా  పై  మోపకు  నేరాన్ని ..
ఏమీ  లేని  పేదనని..నా  పై  మోపకు  నేరాన్ని ..
లేదు  ప్రేమకు  పేదరికం ..నే  కోరను  నిన్ను  ఇల్లరికం ..
లేదు  ప్రేమకు  పేదరికం ..నే  కోరను  నిన్ను  ఇల్లరికం ..
నింగీ  నేలకు కడు దూరం ..మన  ఇద్దరి  కలయిక  విడ్డూరం.. 



- లాస్య రామకృష్ణ 





Jan 8, 2012

మా బాదం చెట్టు

నేను విశ్లేషించిన కథ పేరు - మా బాదం చెట్టు 
రచయిత - మల్లాది  వేంకట కృష్ణమూర్తి


 ఆంధ్రపాఠకుల ఆహ్లద రచయిత మల్లాది వేంకట  కృష్ణమూర్తి . పాఠకుల హృదయాలలో ఆయన  స్థానం సుస్థిరం.  . సరళమైన భాష, సుస్పష్టమైన శైలి ఆయన సొంతం.


మల్లాది గారి 'మా బాదం చెట్టు ' కధ నన్ను బాగా ఆకర్షించింది. టైటిల్ చూడగానే నన్ను చిన్ననాటి రోజులకి అక్షరాలనే టైం మెషిన్ తో ఈ కథ  తీసుకెళ్ళిపొయింది. ఉత్తుమపురుష(first person) లో ఈ కథ సాగింది.

సంక్షిప్తంగా ఈ కథ గురించి చెప్పుకోవాల్సి వస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న కథానాయకుడు తన ఇంట్లొనున్న  బాదం చెట్టు విశేషాల గురించి తలచుకుని ఆ మదురానుభూతుల్ని మనతో పంచుకుంటాడు. బాల్యం లొ బాదం చెట్టుతొ అల్లుకుపోయిన తన అనుబంధాన్ని గుర్తుచేస్తు తను వివరించే ప్రతి అంశం ప్రతి ఒక్కరికి బాల్యపు రోజులని  గుర్తుచేస్తుంది.

కథనం బాదం చెట్టు చుట్టూ తిరిగినా, నిజానికి ఇది మధ్యతరగతి కుటుంబాలలొని  అనుబంధాలని స్ప్రుశిస్తుంది అనడానికి ఈ వాక్యాలే  ఉదాహరణ "మా నాన్నగారు ఆఫీస్ నించి రాగానే దొడ్లో తొట్లోని నీళ్ళతో కాళ్ళు కడుక్కుని, ఓ సారి బాదం చెట్టు దగ్గర ఆగి తన చేతులతో కింది కొమ్మని ముట్టుకునేవారు. అంతదాకా చిరాగ్గా ఉండే మా నాన్నగారిలో చిరాకంతా తక్షణం మాయమయ్యేది. ప్రశాంతంగా, చిరునవ్వుతో ఇంట్లోకి వచ్చేవారు. పిల్లలందర్నీ పలకరించాకే, మా అమ్మ ఇచ్చే కాఫీ గ్లాసుని అందుకునే వారు. ఉదయం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు  మళ్ళి బాదం చెట్టుదగ్గరి వెళ్ళి కింది కొమ్మనుంచి ఏదో అందుకున్నట్లుగా నటించి ఆఫీస్‌కి  వెళ్ళిపోయేవారు.   మా నాన్నగారి సంతానంలో మేం ఎవరం మా ఆఫీస్ సమస్యల వల్ల కలిగే చీకాకుని ఇంట్లోని కుటుంబ సభ్యుల మీద చూపించి ఎరగం. మా నాన్నగారు మాకు ఈ విషయంలో ఆదర్శంగా ఉండటానికే ఆ బాదం చెట్టుని వాడుకుని ఉంటారని నాకు పెద్దయ్యాక అర్థమైంది." 

ఎంతో సున్నితంగా తల్లి ప్రేమని కూడా రచయిత ఈ మాటల ద్వారా  చాలా అందంగా చిత్రీకరించారు.

"అమ్మా! ఆ బాదం చెట్టుని ఎవరు కనుక్కున్నారు?" 
"నువ్వేరా, నీ చిన్నప్పుడు ఓ రోజు నువ్వు నా దగ్గరకి పరిగెత్తుకు వచ్చి చెప్పావు."
మా మధ్య రెండు మూడు రోజులకోసారి ఈ సంభాషణ జరిగేది. 
ఇప్పుడనిపిస్తోంది, అది నిజమై ఉండదని. ఎందుకంటే నేను బాల్యంలో ఉండగానే అది బాగా ఎదిగి కాయలు కాస్తోంది.
 నేను కనిపెట్టానని చెప్పి నన్ను బాల్యంలో మా అమ్మ ఆనందింప చేసిన ఆ చెట్టు వంక తృప్తిగా చూసి వెనక్కి తిరిగాను. 

అంతే కాకుండా, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములతో  మరియు స్నెహితులతో కథానాయకుడికి ఉన్న అనుబంధానికి  నిలయం అయ్యింది బాదం చెట్టు.

ఇంచుమించుగా ప్రతి ఒక్క పాఠకుడికి  కథానాయకుడి  బాల్యంలొ తమకి తమ బాల్యం ప్రతిబింబించే విధంగా రచయిత కథనం సాగించారు. నిద్ర లేవ గానె బాదం చెట్టు కిందకి పండి రాలిన బాదం కాయల కోసం పరిగెత్తటం, బాదం ఆకులలో ఫలహారం తినడం, బాదం కొమ్మలకి ఉయ్యాలలు  వెయ్యటం, చెట్టు నీడలో బొమ్మల పెళ్ళిల్లు ఇంక ఎన్నెన్నొ ఆటలు చిన్న చిన్న పొట్లాటలతొ మదురమైన జ్ఞాపకాలు తీయని కలలాగ కంటి ముందు కదులుతుంది.

ఈ నాటి హడావిడి  జీవితాలలో ఇప్పటి పిల్లలకి  ఇలాంటి మధురానుభూతులు కరువవుతున్నాయి అని రచయిత హృదయాన్ని స్పృసించే విధంగా  చెప్పారు. కథ చివర్లొ కథానాయకుడు తన పాత ఇంటి దగ్గరున్న బాదం చెట్టు ని చూడడానికి  వెళ్ళి ఒక సారి అ బాదం రుచి చుసి "నేనుండే కాంక్రీట్ జంగిల్‌లో మా పిల్లలకి ఇంతవరకూ బాదం పప్పు రుచి తెలీదు" అని అనుకోవడం మనల్ని ఆలొచింపజేస్తుంది.

- లాస్య రామకృష్ణ 


కాలేజీ స్టొరీ

ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక - 28th October, 2010 లో ప్రచురింపబడింది. 


క్క క్క క్క....కాలేజీ స్టొరీ....

రమ్య ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు. 'ఎందుకు వెళ్ళలేదా?' అని తీవ్రంగా ఆలోచించాను. ఎంతకీ తట్టలేదు. మొన్నొకసారి... 'ఫ్రెషర్స్ డే' వస్తోంది... వెళ్ళను' అంది. బహుశా, ఇవాళ ఫ్రెషర్స్ డే అయి ఉండొచ్చు. కానీ తన ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు ఫ్రెషర్స్ డే ఎలా జరిగిందని అడగడం విన్నాను. 

అంటే, ఇవాళ రమ్య ఎందుకు కాలేజీ కి వెళ్ళలేదు? ఎలాగైనా కనిపెట్టాలి? 

'ఇన్నిడైలాగులెందుకు  డైరెక్ట్ గా అడగొచ్చు కదా...' అనుకుంటున్నారా? కానీ డైరెక్ట్ గా అడిగేస్తే...సీరియల్ డైరెక్టర్ అవ్వాలన్న న కోరిక తీరదు. ఏ విషయమైనా పరిపరివిధాలా మనసులో అలోచించి...మనలో మనం పైకి వినపడేలా మాట్లాడుకోవడమే సీరియల్ లో కేరెక్టర్ లక్షణం. కాబట్టి ఈ ఎపిసోడ్ చివరికల్లా...రమ్య ఎందుకు కాలేజీ కి వేల్లలేదో కనుక్కుంటాను. ఇట్స్ మై ప్రామిస్..అఫ్ కోర్స్...ఇలాంటి సిల్లి ఛాల్లెంజ్ లు కూడా సీరియల్స్ లో ని కేరెక్టర్స్ ని చూసి నేర్చుకున్నాను. 

రమ్య వంటింట్లోకి వెళ్ళింది. వంట చెయ్యడానికనుకున్నారా? దాని కంత సీను లేదు. మంచి నీళ్ళు తాగడానికి వెళ్ళింది. ఇంకా...రమ్య ఎందుకు కాలేజీ కి వెళ్ళలేదు...అనే విషయం ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ తట్టలేదు.

రమ్య బయటికి వచ్చింది. బుక్స్ తీసింది. చదువుకుంటుంది అనుకుంటున్నారా? కరెక్టే...అక్కౌంట్స్ చేసుకుంటోంది. దానికో డౌట్ వస్తే నన్ను అడిగింది. ఆ డౌట్ క్లియర్ చేశాను. 

అయితే ఇప్పటికి నా మనసుని తొలిచేస్తున్న ప్రశ్నకి ఆన్సర్ దొరకలేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ లోపు సాయంత్రం ఆరయింది. సిరియస్ గా సిరియల్స్ ని ఫాలో అయ్యే నేను టీవీ స్విచ్ ఆన్ చేశాను. అప్పుడర్ధమైంది రమ్య కాలేజీ కి ఎందుకెల్లలేదో?

టీవీ లో 'సండే స్పెషల్ మూవీ' అనే బ్యాంగ్ పడింది. అంటే...ఇవాళ ఆదివారం. సండే కాలేజీలకు హాలిడే...స్టూడెంట్స్ కి జాలిడే కదా.

'హ హ హ...కనిపెట్టేసా...రమ్య కాలేజీ కెందుకు వేల్లలేదో...నేనిప్పుడే కనిపెట్టేసా'.

-లాస్య రామకృష్ణ 


Jan 6, 2012

ఇల్లాలి ముచ్చట్లు

నేను ఇటివలే హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు నాన్నగారి దగ్గర 'పురాణం సీత' గారు రచించిన "ఇల్లాలి ముచ్చట్లు" అనే బుక్ చూసాను. అ పుస్తకం లోని రచనలు నన్నెంతగానో  ఆకర్షించాయి. నేను తిరిగి బెంగుళూరు వచ్చేటప్పుడు ఆ బుక్ నాతో పాటే తెచ్చుకున్నాను.

ఆ పుస్తకపు విశేషాలు మీతో పంచుకోవాలనిపించింది. మీకోసం ఆ పుస్తకానికి సంబందించిన కొన్ని విషయాలు.......

ఇందులోని వ్యాసాలు 1960 దశకంలో మొదలై 1990 దాకా ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో వెలువడ్డాయి." ఈ వ్యాసాలలో చమత్కారం నాకు బాగా నచ్చింది. అలాంటి కోవకే చెందినా ఒక వ్యాసం "పరుపు కింద పైజమా" గురించి మీతో పంచుకుంటున్నాను.

"పరుపుకింద పైజమా"


ఒకసారి సితగారి కజిన్ లలిత అనే అమ్మాయి ఉన్నట్టుండి ఏడుస్తూ పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి ఆరో నెలో ఏడో నెలో అట.  ఏడుస్తూ సడన్ గా ఎందుకు వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచి ఉన్నాయ్ కదా కొంత కాలం ఆగాక అసలు విషయం అడగవచ్చని ఊరుకుంటారు.

సరే కొంత సమయం ఇచ్చి విషయం తెలుసుకుందామంటే ఎంతకీ ఆ అమ్మాయి  చెప్పనే  చెప్పదు. సరే తన వంతు ప్రయత్నంగా ఆ అమ్మాయని సంతోష పెట్టటానికి రక రకాల పిండి వంటలు చేసి పెడ్తుంది సీత. ఇంకా ఆ విషయం ఈ విషయం అని తన మనసు ని ధ్యాస మరల్చడానికి ప్రయత్నిస్తుంది.కానీ ఇవ్వేవి పలితాన్ని ఇవ్వవు, అన్ని తిని కూడా ఆ అమ్మాయి దిగులుగా ఉండేది.

ఇహ ఇలా కాదని ఆ అమ్మాయని మళ్ళి గట్టిగ ప్రశ్నిస్తే ఆ అమ్మాయ్ చెప్పిన విషయం ఏంటంటే
వాళ్ళ అయన క్యాంపు ల ఉద్యోగం చేస్తుంటాడు. అలా క్యాంపు ల మీద నెల అంతా తిరిగి ఇంటికి వచ్చిన ఒక రోజు ( సీత గారు వ్యక్తీకరణ ఇక్కడ చమత్కారంగా ఉంటుంది అందుకే తను రాసిన వాక్యాలే యదాతధంగా ఇక్కడ వ్రాస్తున్నాను) పొట్టపగిలేల భోంచేసి, తమలపాకులు నములుతూ గేదె దూడ లాగ  పందిరి మంచం మీద పవళించి లేచి ఎందుకో(నల్లికుట్టింది కాబోసు) పరుపు ఎత్తగానే దానికింద ఒక పైజమా చారల చారలది కనిపించిందట. దాంతో ఆగ్రహోదగ్రుడై గుడ్డ్లెర్ర జేస్తూ "ఈ పైజమా ఎవరిదే" అని అడిగి ఫో కులట ఫో పుట్టింటికని పనిమనిషి సహయం ఇచ్చి పంపించాడు.

ఈ పరుపు కింద పైజమా మిస్టరీ ఎంతకీ అంతుబట్టదు సితగారికి.

ఒకసారి, సితగారు ఈ అమ్మాయిని డాక్టర్ దగ్గరికి చెక్ అప్ కి తెసుకెలుతుంది. పన్లోపనిగా లేడీ డాక్టర్ని "'పరుపు కింద పైజమా గురించి మీకు తెలుసా" అని అడుగుతుంది. డాక్టర్ తెల్లబోయి సితగారిని "రండి మిమ్మల్ని చెక్ అప్ చెయ్యాలి అంటుంది" అప్పుడు "మీ పరుపు కింద పైజమా ఉందా" అని డాక్టర్ ని అడుగుతుంది. లేడీ డాక్టర్ అయిన పెళ్ళికాని లేడీ యే కనుక కొంచెం సిగ్గు పడి, కొంచెం ఎర్రబడి, ఇంకా అంత వరకు రాలేదన్నట్లు నవ్వి ఒక చీటి రాసిచ్చి, " ఈ బిళ్ళలు మూడు పుటల పుచ్చుకుని, పాలు తాగి పడుకో"మని చెప్పింది.

ఇంతకి ఈ సమస్య పరిష్కరించేది సీత గారి భర్త. అతను లలితతో "మీ ఇంట్లో చాకలి పద్దు ఎవరు వేస్తారు నువ్వా మీ ఇడియట్ వేస్తాడా  అని అడగగానే ఆ అమ్మాయికి విషయం అర్ధమయిపోయింది ఒక నవ్వు నవ్వుతుంది. వెంటనే లలిత మొగుడికి ఇతను విషయం వివరించి ఉత్తరం రాస్తాడు. వెంటనే ఆ అమ్మాయి మొగుడు వచ్చి లలితను తీసుకెళతాడు.

అసలు విషయం అర్ధం కానీ సితగారు అయోమయం లో ఉండగా ఆవిడా భర్త ఇలా వివరిస్తాడు. చాకలి ఇచ్చిన వేరేవరిదో పైజమా లలిత మొగుడు నిద్రమత్తులో తీసుకుని పరుపుకింద పెట్టి తర్వాత క్యాంపు కి వెళ్ళిపోయాడు. వచ్చాక ఆ విషయం మర్చిపోయి లలిత మీద అనుమానపడ్డాడు. ఇది జరిగిన కధ అని వివరిస్తాడు.

ఇంకొక విశేషమేమిటంటే పురాణం సీత పేరుతో రచనలు చేసింది ప్రసిద్ద రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ. 


-లాస్య రామకృష్ణ